తిరుమలలో మనవడితో సీఎం చంద్రబాబు.. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డన

  • మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్లిన సీఎం చంద్రబాబు
  • శ్రీవారి దర్శనం అనంతరం భక్తులకు అన్నప్రసాదం వడ్డించిన ముఖ్యమంత్రి
  • మాడ వీధుల్లో భక్తులకు అభివాదం చేస్తూ నడిచిన సీఎం, మంత్రి లోకేశ్‌
  • సెక్యూరిటీని పక్కనపెట్టి భక్తులతో కరచాలనం, ఫొటోలు దిగిన చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారు భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి ప్రత్యేక సేవలో పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనం పూర్తయ్యాక, ఆలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌, దేవాన్ష్‌తో కలిసి కాలినడకన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి బయలుదేరారు. ఈ క్రమంలో మాడ వీధుల గుండా వెళ్తూ దారిపొడవునా ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన భద్రతా సిబ్బందిని పక్కకు జరిపి, భక్తుల వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. పలువురు భక్తులతో ఆయన, మనవడు దేవాన్ష్ కలిసి ఫొటోలు దిగారు. భక్తులు దేవాన్ష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం అన్నదాన సత్రానికి చేరుకున్న చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఈ సేవలో పాల్గొనడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.


Chandrababu
Tirumala
Devansh
Nara Lokesh
Annabrasadam
Tirupati Temple
Andhra Pradesh
Birthday Celebrations
Bhuvanaeswari
Pilgrims

More Telugu News